మారిటైమ్‌ ఇండియా సదస్సులో జగన్‌..

 

 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో పాల్గొన్నారు. మంగళవారం ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌, గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్‌ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ నెల 4 వరకు మారిటైమ్ ఇండియా సదస్సు జరగనుంది.

దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ అన్నారు జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2020లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని.. ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని.. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతానికి పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని.. 2023 నాటికి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని.. ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు రూపొందించే పనిలో ఉందని కేంద్రం తెలిపింది.