వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్న వేళ.. ఈ
కర్మాగారం కోసం భూములిచ్చిన రైతులు కేంద్రానికి షాకిచ్చేందుకు
సిద్ధపడుతున్నారు. తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ కోసం భూములిచ్చిన రైతులు.. స్టీల్ ప్లాంట్ను
ప్రయివేటీకరిస్తే తమ భూములను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్
ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో నడిపితే సరే.. లేదంటే తమ భూములు తమకు ఇవ్వాలని
డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రజల ఉద్యమం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థగా విశాఖ
స్టీల్ ప్లాంట్ను స్థాపించారు. 20 వేల ఎకరాలకు పైగా భూములను ప్రజోపయోగ
కోణంలో రైతుల దగ్గర్నుంచి సేకరించారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ
లక్షన్నర కోట్ల పైమాటే.
1960, 70ల మధ్యలో 16,660 మంది రైతులు
దాదాపు 22 వేల ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చేశారు. అప్పటి విశాఖ
కలెక్టర్ అర్జున్ రావు భూములు ఇచ్చేలా రైతులను ఒప్పించారు. భూములను
కోల్పోయిన వారి కుటుంబీకులకు అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని
చెప్పారు. ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని చెప్పి రైతులను
ఒప్పించారు. ముందు వెయ్యి ఎకరాలతో భూసేకరణ ప్రారంభమైంది. భూములిచ్చిన
కుటుంబాలకు ప్రభుత్వం ఆర్-కార్డులు (రీహాబిలిటేషన్ కార్డులు) ఇచ్చింది.
ఇందులో సంబంధిత కుటుంబానికి ఇచ్చిన పరిహారం, అర్హతల ఆధారంగా ప్లాంట్లో
ఉద్యోగం లాంటి వివరాలను పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఐటీఐలను ఏర్పాటు
చేసి.. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలకు అర్హత సాధించడం కోసం.. యువత ఆ
కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..
ప్లాంట్ కోసం భూములిచ్చిన వారిలో చాలా మందికి ఇప్పటి వరకూ ఉద్యోగాలు
దక్కలేదు. కొందరికైతే భూమి ఇచ్చినందుకు పరిహారం కూడా దక్కలేదు. హైకోర్టు,
సుప్రీం కోర్టు పరిహారం ఇవ్వాలని తీర్పులు వెలువరించినా.. 50 ఏళ్ల క్రితం
ఇచ్చిన భూములకు ఇప్పటి వరకూ కొందరు పరిహారాన్ని పొందకపోవడం గమనార్హం. దీంతో
ప్రభుత్వం భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ
స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ల ఆందోళనల్లో పాల్గొనే విషయమై రైతులు చర్చలు
జరుపుతున్నారు. గతంలో ప్రభుత్వాలు 2 వేల ఎకరాల భూమిని ప్రైవేట్ పోర్టుకు
నామమాత్ర ధరకు కట్టబెట్టినప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. రైతులు స్టీల్
ప్లాంట్ కోసం భూములిచ్చారు. ప్లాంట్ను ప్రయివేట్ రంగానికి కట్టబెడతామంటే..
ఇచ్చేవారు కాదేమో అని నగరానికి చెందిన రాజకీయ విశ్లేషకులు ఎం. యుగంధర్
రెడ్డి అభిప్రాయపడ్డారు.
స్టీల్ ప్లాంట్ భూములిచ్చిన రైతుల డిమాండ్..