కొవిడ్ వ్యాక్సిన్ @రూ.250 ఫిక్స్ చేసిన కేంద్రం..

 ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మార్చి 1 నుంచి మలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్ను నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఫిబ్రవరి 24న తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. 

వ్యాక్సిన్ నిమిత్తం నామినల్ ఫీజులనే వసూలు చేస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. సిరంజీలు, వ్యాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన మానవ వనరుల ఖర్చులు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. 250 రూపాయల్లో రూ.100 సర్వీస్ ఛార్జీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు కూడా అందిస్తున్నారు.